28 మంది న్యాయవాదులకు సరికొత్త శిక్షను విధించిన కేరళ హైకోర్టు

  • చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన న్యాయవాదులు
  • కోర్టు ధిక్కరణ కింద తీవ్రంగా పరిగణించిన కేరళ హైకోర్టు
  • 6 నెలల పాటు ఉచితంగా న్యాయ సేవలు అందించాలని ఆదేశాలు
కేరళ హైకోర్టు 28 మంది న్యాయవాదులకు వినూత్నమైన శిక్ష విధించింది. ఆ న్యాయవాదులంతా కొట్టాయం బార్ అసోసియేషన్ కు చెందినవారు. గతేడాది వారు కొట్టాయంలో చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కు వ్యతిరేకంగా అసభ్య దూషణలు చేశారు. వారు కోర్టు ఆవరణలోనే అభ్యంతరకర నినాదాలు చేయడాన్ని కేరళ హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. కోర్టు ధిక్కరణగా భావిస్తూ సదరు న్యాయవాదులపై హైకోర్టు విచారణ చేపట్టింది. 

అయితే, ఆ 28 మంది న్యాయవాదులు క్షమాపణ చెప్పేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. కానీ హైకోర్టు ధర్మాసనం అందుకు అంగీకరించలేదు. క్షమాపణ చెప్పి తప్పించుకుందామనుకుంటే కుదరదు... క్షమాపణలు చెప్పి వెళ్లిపోవడం అనేది చాలా సులభమైన మార్గం... ఇప్పటి నుంచి మీరంతా ఆరు నెలల పాటు ఉచితంగా న్యాయ సేవలు అందించాలి... ఎవరి నుంచీ ఎలాంటి ఫీజులు వసూలు చేయకూడదు అంటూ తన ఆదేశాల్లో పేర్కొంది. 

ఆ 28 మంది న్యాయవాదులు కూడా కోర్టు ఆదేశాలకు సమ్మతి తెలిపారు. కోర్టు చెప్పినట్టు తప్పకుండా చేస్తామని, న్యాయవాద వృత్తిని కొనసాగించడానికి ఇదేమీ అడ్డంకి కాబోదని వెల్లడించారు.

Kerala High Court
Advocates
Free Legal Services
Kottayam
Kerala

More Telugu News